-తప్పుడు వార్తలు నమ్మొద్దు-ఫేక్ ప్రచారకులకు లీగల్ వార్నింగ్
-అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి హెచ్చరిక

మంచిర్యాల ప్రత్యక్షత:-డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే చర్యలపై అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు, ఫేక్ పీడీఎఫ్లు, వాస్తవాలకు విరుద్ధమైన కథనాలను వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారని సంస్థ ఆరోపించింది.ఈ నేపథ్యంలో సంస్థ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో, ఇలాంటి చర్యలను సాధారణ ప్రచారంగా కాకుండా ఉద్దేశపూర్వక దుష్ప్రచారంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ సంస్థపై జరుగుతున్న ప్రచారాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు లేదా అనామక పేర్లతో వ్యవహరించినా, సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ట్రాకింగ్ ద్వారా సంబంధిత వ్యక్తులను గుర్తించడం సాధ్యమేనని పేర్కొన్నారు. సంస్థపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, నిరాధార కథనాలు ప్రచారం చేయడం, ప్రజల్లో అపోహలు కలిగించడం వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని హెచ్చరించారు.అలాగే ఎలాంటి ధృవీకరణ లేకుండా తప్పుడు సమాచారాన్ని ఇతర గ్రూపుల్లో లేదా సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ప్రచారాలను నమ్మే ముందు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.అంజనీపుత్ర సంస్థ తన కార్యకలాపాలను పారదర్శకత, వినియోగదారుల విశ్వాసం, నైతిక విలువలను కేంద్రంగా చేసుకుని కొనసాగిస్తోందని యాజమాన్యం తెలిపింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు కొనసాగితే అవసరమైతే పరువు నష్టం దావాలు కూడా వేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది.మీ నమ్మకమే మా బలం ఆ నమ్మకానికి ఎలాంటి భంగం కలగనివ్వం అని పేర్కొంటూ, ఎలాంటి దుష్ప్రచారాలకు తలొగ్గకుండా పారదర్శకత, బాధ్యతతో ముందుకు సాగుతామని సంస్థ వినియోగదారులకు భరోసా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో అంజనిపుత్ర రియల్ ఎస్టేట్ డైరెక్టర్లు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

