-భువనగిరి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి
-బీసీ సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని సూచన:
పేరం అలేఖ్య

మంచిర్యాల ప్రత్యక్షత:-జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న బీసీ రాజ్యాధికార సమర భేరి సభను విజయవంతం చేయడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జాతీయ, ప్రాంతీయ బీసీ సంఘాల నాయకులు ఒకే వేదికపైకి రావాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, హైకోర్టు న్యాయవాది పేరం అలేఖ్య కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ సమస్యలపై దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఆశించిన స్థాయిలో చైతన్యం పెరగలేదన్నారు. బీసీ ఉద్యమాలకు ప్రజల మద్దతు పెరగాలంటే సంఘాలు సంఘటితంగా ముందుకు రావాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఉన్న వనరులు, వ్యవస్థీకృత నిర్వహణతో పోలిస్తే బీసీ సంఘాలకు ఆర్థిక, సంస్థాగత పరమైన పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల బలోపేతంపై దృష్టి పెట్టి, ప్రజల సమస్యలపై నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. భువనగిరి సభకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ బీసీ నాయకులు, జాతీయ మరియు ప్రాంతీయ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి ఐక్య వేదికగా నిర్వహిస్తే ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ సంఘాలు పరస్పర సహకారంతో ముందుకు వచ్చి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకురాలు కుమ్మరి కోడూరి లీలావతి, మంచిర్యాల జిల్లా కన్వీనర్ పోతు విజయ తదితరులు పాల్గొన్నారు.

