-కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్జీవో జిల్లా నేతలు

మంచిర్యాల ప్రత్యక్షత:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు బ్యాంకుల మధ్య ఉద్యోగుల ప్రమాద బీమా పథకం ఒప్పంద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు బీమా రక్షణ వర్తించేలా ఒప్పందం కుదిరింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేన్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, మాజీ జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, ఈ ప్రమాద బీమా పథకం కేవలం శాశ్వత ఉద్యోగులకు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత కలుగుతుందని పేర్కొన్నారు.ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బీమా సౌకర్యాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రివర్గం, టీజీఈజేఏసీ నాయకత్వానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా తరఫున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు.

