-ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి
-తల్లిదండ్రులకు అధిక ఫీజుల భారాన్ని తగ్గించాలి: జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. పాషా

మంచిర్యాల ప్రత్యక్షత:-విద్య ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కు అని, విద్యాహక్కు చట్టాన్ని జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (టీబీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. పాషా డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయని ఆరోపిస్తూ నస్పూర్ లోని సమీకృత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో టీబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ అజయ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్.కె.పాషా మాట్లాడుతూ జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని అన్నారు. అడ్మిషన్ నిర్ధారణ ఫీజు, ప్రత్యేక ఫీజులు, అభివృద్ధి రుసుములు వంటి పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు, యూనిఫారాలు, స్టేషనరీ సామాగ్రి తప్పనిసరిగా పాఠశాలల వద్ద లేదా వారు సూచించిన బుక్ స్టాళ్లలోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తమ పాఠశాల పేర్లతో ప్రత్యేక పుస్తకాలు ముద్రించి అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, ఇది విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

పాఠశాలల సమీప ప్రాంతాల్లో అద్దె గదులు తీసుకొని పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.అలాగే టెక్నో, ఐఐటీ, నీట్, స్మార్ట్, సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్,కాన్సెప్ట్, ఎక్సలెన్స్ వంటి పేర్లతో విద్యాసంస్థలు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, కనీస మౌలిక వసతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. పాఠశాలల్లో ఫీజుల వివరాలు, ఉపాధ్యాయుల జాబితా, నోటీస్ బోర్డులు వంటి అంశాలు స్పష్టంగా ప్రదర్శించకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీబీఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

