-27న నస్పూర్లో భారీ ఆందోళనకు సన్నాహాలు

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నస్పూర్ ఐడీఓసీ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేసేందుకు టీజీఈజేఏసీ నాయకులు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 3 వేల మంది ఉద్యోగులు తరలివచ్చేలా కార్యాచరణ చేపట్టారు.టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య, పోలీస్ శాఖల్లో ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ అమలు, 6 డీఏల చెల్లింపు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, ఈహెచ్ఎస్ అమలు, 17 శాతం హెచ్ఆర్ఏ, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విడుదల వంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో టీజీఈజేఏసీ జిల్లా నాయకులు వనజారెడ్డి, పొన్న మల్లయ్య, బొడ్డు శ్రావణ్కుమార్, నాగుల గోపాల్, సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


