-టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా రెండో సన్నాహక సమావేశం

మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం మంచిర్యాలలోని టీఎన్జీవో సమావేశ భవనంలో జిల్లా రెండో సన్నాహక సమావేశం నిర్వహించారు.టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక, సేవా సంబంధిత సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకు సాగి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు.రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు విడతల కరువు భత్యం (డీఏ)ను విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రతి నెల రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేసి బకాయిలను త్వరగా చెల్లించాలని కోరారు.అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) సమస్యను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లకు తగిన గుర్తింపు కల్పించి వాటి సమస్యలను అధికారికంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.ఉద్యోగుల ఆర్థిక, సామాజిక, సేవా ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సంఘాల నాయకులతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని టీజీఈజేఏసీ నాయకులు కోరారు.

సమస్యల పరిష్కారం కోసం తదుపరి కార్యాచరణను అన్ని సంఘాలతో సమన్వయం చేసుకుని చేపట్టాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో టీజీఈజేఏసీ జిల్లా కో-చైర్మన్లు శ్రీనివాస్రావు దేశ్పాండే, బట్టారి వెంకటేశ్వర్లు, బెజ్జంకి జగన్, సుమిత్, పుప్పాల హనుమంతరావు, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గాప్రసాద్, భూముల రామ్మోహన్, డి.వేణుగోపాల్, పత్తి సత్తయ్య, పొడేటి సంజీవ్, డిప్యూటీ చైర్మన్ బొడ్డు శ్రావణ్కుమార్, సుధాకర్, వైస్ చైర్మన్లు సూరినేని గంగాధర్, ఒడిగ కృష్ణ, బి.రవీందర్, ఎస్.కిషన్, ఏ.సునీత, నాగుల గోపాల్, ప్రచార కార్యదర్శి రాంకుమార్, కార్యదర్శులు సత్యనారాయణ, తిరుపతి, రాసమల్ల రవి, పొలస సత్యనారాయణ, కుమారస్వామి, జయకృష్ణ, సీపీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏ.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

